మరో మూడేళ్ళలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మెల్లగా హడావుడి మొదలవుతున్నట్లు కన్పిస్తోంది. ఈ క్రమంలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ మరో అడుగు వేయనున్నారు. దేశంలోని విపక్ష నేతలందరితో ఆమె భేటీ కానున్నారు. త్వరలో తాను దిల్లీకి వెళ్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత పవార్, సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్, సీఎం కేజ్రీవాల్తో సహా పలువురు విపక్ష నేతలను కలుసుకోనున్నారు. బెంగాల్ ఎన్నికల తరువాత తను ఢల్లీి వెళ్లలేదని, ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కూడా కొంత తగ్గినందువల్ల దిల్లీకి వెళ్లాలనుకుంటున్నానని ఆమె చెప్పారు. పైగా పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి గనుక ఈ నేతలందరితోనూ భేటీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దిల్లీలో తాను నాలుగు రోజులు ఉండవచ్చని, అయితే ఏ తేదీన బయలుదేరతానో ఇంకా నిర్ణయించుకోలేదని ఆమె చెప్పారు.