పశ్చిమబెంగాల్లోని బీర్భూం జిల్లాలో చోటుచేసుకున్న సజీవదహనాల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పార్లమెంటులో ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఎంపీ రూపా గంగూలీ ఆవేదన వ్యక్తంచేశారు. బెంగాల్ను ఆదుకోవాలంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఇవాళ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. ఇటీవల బీర్బమ్లో జరిగిన హింస గురించి ఆమె జీరో అవర్లో ప్రస్తావించారు.‘బెంగాల్లో సామూహిక హత్యలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి ప్రజలు పారిపోతున్నారు. ప్రజలు జీవించడానికి తగిన ప్రాంతంకాదు. అక్కడ ప్రజలు మాట్లాడలేరు, ప్రభుత్వం హంతకులను రక్షిస్తోంది.’ అంటూ ఆమె బెంగాల్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రూపా మాట్లాడుతున్న సమయంలో తృణమూల్ ఎంపీలు సభలో ఆందోళన సృష్టించారు.అటాప్సీ రిపోర్ట్ ప్రకారం.. తొలుత అక్కడ వాళ్లను కొట్టినట్లు తెలుస్తోందన్నారు. కొట్టిన తర్వాత సామూహిక హత్యలు జరిగినట్లు రూపా ఆరోపించారు. బెంగాల్ నుంచి జనం పారిపోతున్నారని గంగూలీ ఆరోపించారు. భారత్లో బెంగాల్ భాగమని, అక్కడ జీవించే హక్కు ఉందని, మేం బెంగాల్లో పుట్టామని, అక్కడ పుట్టడం తప్పుకాదు అని, మహాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడారు. భావోద్వేగంతో ఏడ్చేశారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. తృణమూల్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను వాయిదా వేశారు.