వినయ్ విశ్వం
న్యూదిల్లీ : అకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు, రోజూ పెరుగుతున్న పెట్రో ధరలపై చర్చ అంటే కేందప్రభుత్వం భయపడిపోతోందని సీపీఐ ఎంపీ వినయ్ విశ్వం విమర్శించారు. ధరలు పెంచడమే తప్ప తగ్గించడం, ప్రజలకు ఉపశమనం కలిగించడం ప్రభుత్వానికి తెలియదని విమర్శించారు. ధరల పెంపుపై విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బీజేపీ ప్రభుత్వ దురహంకారం కారణంగా రాజ్యసభలో అసంతృప్తికర వాతావరణం నెలకొందని విశ్వం అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంటులో చర్చించేందుకు వెనుకాడారుగానీ సీఆర్పీసీ గుర్తింపు బిల్లు ఆమోదానికి తొందరపడ్డారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చలకు అననుకూల ప్రదేశంగా పార్లమెంటు మారిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది అమృత కాలం కాదు వినాశ కాలమని విశ్వం వ్యాఖ్యానించారు.