లక్నో: ఉత్తరప్రదేశ్లో హింసాత్మక ఘటనలకు తావులేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ముస్లింలు రంజాన్ ఆచారాలు పాటిస్తున్న సమయంలో రామనవమి నాడు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని యోగి అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగిన రెండు రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘25 కోట్ల మంది జనాభా ఉన్న యూపీలో 800 రామనవమి ర్యాలీలు జరిగాయి. అదే సమయంలో రంజాన్ మాసం కావడంతో రోజా, ఇఫ్తార్ కూడా జరిగాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగలేదు. హింస, అల్లర్లు ప్రశ్నే లేదు. ఇది ఉత్తరప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించే వైఖరిని సూచిస్తుంది’ అని యోగి వివరించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు యోగి వీడియోను ట్వీట్ చేశారు. నాలుగు రాష్ట్రాల్లో ఆదివారం జరిగిన మత ఘర్షణల్లో కొంతమంది గాయపడగా, గుజరాత్లో వృద్ధుడు మరణించాడు.