తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పట్టం కడుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. నిర్మల్లో లక్ష్మణచాంద మండలం పోట్టపల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం పిల్లలతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు. కబడ్డీ పోటీలను ప్రారంభించి పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం 5వ విడత పల్లె ప్రగతిలో గ్రామీణ క్రీడా మైదానాల ప్రారంభానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఊరిలో యువకుల కోసం ప్రభుత్వం స్పోర్ట్స్ కిట్స్ ఇస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.