మాయావతి, అఖిలేశ్
లక్నో: మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడం తొందరపాటు చర్య అని బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బీజేపీపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత పెరుగుతోందని, కాషాయపార్టీ కూసాలు కదులుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మాయావతి, అఖిలేశ్ సోమవారం వేర్వేరుగా ట్వీట్లు చేశారు. అగ్నిపథ్ పథకాన్ని దేశంపై రుద్దడం ఆశ్చర్యం కలిగించింది. పెద్దనోట్ల రద్దు, లాక్డౌన్ తరహాలోనే అగ్నిపథ్ను ప్రవేశపెట్టడం తొందరపాటే. నోట్లరద్దు, లాక్డౌన్ కారణంగా కోట్లాదిమంది యువత, వారి కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యాయి. కేంద్రంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అహంకార వైఖరిని ప్రభుత్వం విడనాడాల్సిన అవసరం ఉంది’ అని మాయావతి హితవు పలికారు. బీజేపీ నాయకుల సంయమనం లేని ప్రకటనలు, హ్రస్వదృష్టితో కూడిన రాజకీయాలు ప్రజలను గందరగోళంలోకి నెట్టాయని మండిపడ్డారు.
అగ్నిపథ్ పథకాన్ని అఖిలేశ్ పూర్తిగా వ్యతిరేకించారు. ఈ పథకంపై యువత అసంతృప్తి ప్రదర్శిస్తోందని, భవిష్యత్పై భయాలు, అభద్రతా భావం వ్యక్తీకరిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆందోళనలు, నిరసనలు, హింసాత్మక ఘటనలు దీనిని రుజువు చేస్తున్నాయని అఖిలేశ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దేశ భవిష్యత్కు ఓ రూపు తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. అన్ని వైపుల నుంచి బీజేపీకి వ్యతిరేకత పెరుగుతోందని, దీంతో ఆ పార్టీ మూలాలు కదలడం ఖాయమని అఖిలేశ్ వ్యాఖ్యానించారు.