అసెంబ్లీ సీట్ల పెంపు అంశంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2026 వరకు అసెంబ్లీ సీట్లను పెంచలేమని మరోసారి స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం పార్లమెంటులో సమాధానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, అంతవరకు పెంచలేమని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి, ఈ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి స్థానాలు పెరుగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026లో జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను సర్దుబాటు చేస్తాం’ అని కేంద్రం స్పష్టం చేసింది. గతేడాది లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కూడా కేంద్రం ఇదే సమాధానం చెప్పింది.తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుదలకు సంబంధించి అనేక చర్చలు తెరమీదికొస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల పెరుగుదలపై కేంద్ర కసరత్తు ప్రారంభించిందనే ప్రచారం కూడా సాగుతూనే ఉంది. అయితే అసెంబ్లీ స్థానాల పెంపుపై తాము ఎలాంటి కసరత్తు చేయడం లేదని తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.