మరో ఇద్దరి తీవ్ర గాయాలు
విశాలాంధ్ర`విజయవాడ క్రైం : డ్రైవర్ అత్యుత్సాహం వల్ల కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఇద్దరు పిల్లలు, ఒక యువకుడితోపాటు బడ్డీకొట్టుపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఒక బాలుడు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ కంసలిపేటలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. గుంటూరు జిల్లా కొరిటెపాడు మండలం నాయుడుపేటకు చెందిన ఓ యువకుడికి ఈ నెల 11వ తేదీన పెళ్లి ఉంది. వరుడు, అతని బావమరిది రాజశేఖర్ కుమార్, మరో ఇద్దరు కలిసి పెళ్లికార్డులు ఇచ్చేందుకు నగరంలోని కంసలిపేటలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో పెళ్లి కార్డు ఇచ్చారు. మరొకరికి కార్డు ఇచ్చేందుకు కారులో ఉన్న పెళ్లికార్డును తీసుకురావాలని తాళం ఇచ్చి రాజశేఖర్ కుమార్ను పంపించారు. అతను అత్యుత్సాహంతో కారు తాళం తీసి కార్డు తీసుకుని వెళ్లకుండా కారు స్టార్ట్ చేశాడు. కారు గేరులో ఉండటంతో వేగంగా ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టు, రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు షేక్ చాంద్బాష(షకీల్) , షేక్ అజీమ్(13), కిషోర్(20)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో షేక్ చాంద్బాష మరణించాడు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొత్తపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.