లండన్ : ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. కొలువులు కోల్పోయిన అమెరికన్ ఉద్యోగులకు ఇప్పటికే ఈమెయిల్స్ పంపగా ఇతర ప్రాంతాల్లో వేటుకు గురైన వారికి త్వరలోనే లేఆఫ్స్ సమాచారం అందిస్తారు. కంపెనీ అత్యధిక ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రస్తుత ఉద్యోగులు ఉన్నారా అని తేల్చేందుకు పలు ఉత్పత్తి విభాగాల్లో కఠిన సమీక్ష జరిపామని ఉద్యోగులకు రాసిన లేఖలో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. మాస్ లేఆఫ్స్లో భాగంగా కంపెనీలో ఆరు శాతం ఉద్యోగులను విధుల నుంచి తప్పించారు. కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు తగిన పరిహార ప్యాకేజ్ చెల్లిస్తామని చెప్పారు. 16 వారాల వేతనంతో పాటు గూగుల్లో పనిచేసిన ప్రతి ఏడాదికి రెండు వారాల శాలరీతో పాటు పలు ప్రయోజనాలను ప్యాకేజ్లో వర్తింపచేస్తారు. అమెరికా వెలుపల పనిచేసే గూగుల్ ఉద్యోగులు సైతం వారి కాంట్రాక్టులకు అనుగుణంగా బోనస్లు, హెల్త్కేర్ బెనిఫిట్స్ పొందుతారని కంపెనీ పేర్కొంది. కాగా ఏయే విభాగాల్లో అత్యధికంగా ఉద్యోగులను తొలగించారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కంపెనీ సోమవారం ఉద్యోగులతో టౌన్హాల్ మీటింగ్ ఏర్పాటు చేసిందని పిచాయ్ తెలిపారు. 25 ఏళ్ల ప్రస్ధానం కలిగిన గూగుల్ ప్రస్తుతం సంక్లిష్ట ఆర్థిక వలయాల మీదుగా సాగనుందని, ఈ క్రమంలో తమ ఫోకస్, వ్యయాల పునఃసమీక్ష వంటి చర్యలు చేపట్టాల్సిన సమయమిదని చెప్పారు. ఇక ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.