విశాలాంధ్ర, హైదరాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్త రైతు ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం సీపీిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో జరిగిన సభలో పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం సంస్థానాన్ని కూల్చింది కమ్యూనిస్టులేనని, వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కారణంగానే నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లొంగిపోయేలా చేసిందన్నారు. భారత సైన్యాలు తమ తుపాకులను రజాకార్లపై ఎక్కుపెట్టకుండా కమ్యూనిస్టులపైనే దాడి చేశారన్నారు. ఒక్క రజాకార్ను జైళ్ళలో పెట్టలేదని, వేల మంది కమ్యూనిస్టులను నిర్బంధించారని, 10 లక్షల ఎకరాల భూ పంపిణీ, వెట్టిచాకిరీ నిర్మూలన, భూ సంస్కరణల చట్టాలు, తెలుగు భాషకు గుర్తింపు లాంటి అనేక విజయాలను ఈ పోరాటంతో సాధించారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలక తీతంగా నిజాం నిరంకుశ పాలనపై ఐక్య పోరాటం జరిగిందని, బీజేపీ , దాని మాతృసంస్థ ఆర్.ఎస్.ఎస్.కు నిజాం వ్యతిరేక పోరాటంలో ఎలాంటి పాత్ర లేదన్నారు. పోరాటంలో ఎందుకు పాల్గొనలేదో అమిత్షా, బండి సంజయ్లు సమాధానం చెప్పాలన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా బ్రిటిష్ తొత్తులుగా వ్యవహరించారని, ప్రధాని మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులన్నీ తన మిత్రులైన అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు బీజేపికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్లో పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. సభ అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సుందరయ్య పార్కులోని సుందరయ్య విగ్రహం వరకు భారీ రెడ్ క్లాత్తో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ప్రదర్శనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి. నరసింహారావు, నంధ్యాల నరసింహారెడ్డి, నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు హిమబిందు, బండారు రవికుమార్, ఆశయ్య, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, కె.ఎన్.రాజన్న, ఎం.దశరధ్, ఆర్.అరుణజ్యోతి, ఎం.వెంకటేష్, నగర కమిటీ సభ్యులు మహేందర్, ఎం.అజయ్బాబు, ఎన్.మారన్న, జి.నరేష్, ఆర్.వెంకటేష్, కె.ఈశ్వర్రావు, వి.కామేష్బాబు, సి.మల్లేష్, జె.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.