అల్లూరి సభపై నాగబాబు ట్వీట్
అన్నయ్య చిరును తప్పించి అందరికీ కలిపి ఒకే సెటైర్
ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ సభపైన నాగబాబు స్పందించారు. అందరిపైనా సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. జూలై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రావడంతో ఆ వేడుక అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నటుడు చిరంజీవిని, పవన్ కల్యాణ్ను కూడా ఆహ్వానించారు. చిరంజీవి హాజరైనప్పటికీ కొన్నికారణాలతో పవన్ కల్యాణ్ సభకు దూరంగా ఉన్నారు. అయితే, సభ జరిగిన నాలుగు రోజులకు ఆ కార్యక్రమం గురించి నాగబాబు స్పందించారు. ఈ మేరకు గురువారం ఉదయం ట్వీట్ చేశారు.అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ సభ అద్భుతంగా జరిగిందని కొనియాడారు. ఆ సభలో తన అన్న చిరంజీవి తప్ప మిగిలిన వారంతా అద్భుతంగా నటించారంటూ, పర్ఫార్మెన్స్ బాగుందంటూ అందరికీ కలిపి సెటైర్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.‘‘మన్యం వీరుడు ‘‘అల్లూరి సీతారామరాజు’’ విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది, ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు. ఆ మహనటులందరికీ ఇదే నా అభినందనలు.’’ అని నాగబాబు ట్వీట్ చేశారు.