హైదరాబాద్ : ‘‘బండ లింగపల్లిలో గౌరి(నిత్యామీనన్) ఓ ధనిక కుటుంబంలో పుట్టిన బిడ్డ. జర్నలిస్ట్ కావాలనే కోరికతో ప్రతిబింబం పత్రికకు వార్తలు రాస్తుంటుంది. డాక్టర్ ఆనంద్(సత్యదేవ్) తన గ్రామంలో హాస్పిటల్ పెట్టాలనుకుం టాడు. స్వార్ధపరుడైన అతను తన పని అయితే చాలనుకుంటాడు.. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచన. వీరితోపాటు సుభేదార్ రామారావు కూడా. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య. వారి సమస్యలు తీరాలంటే మిరాకిల్ జరగాలి. అదే సమయంలో అంతరిక్ష్యంలో ప్రవేశ పెట్టిన ఉపగ్రహం స్కైలాబ్.. సాంకేతిక కారణాల వల్ల పెను ప్రమాదం వాటిల్లబోతుందని రేడియోలో వార్త వినిపి స్తుంది. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందని అందరూ భావిస్తారు. అప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి’’ అన్నది తెలుసుకోవాలంటే ‘స్కై లాబ్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1979లో సాగే పీరియాడికల్ చిత్రాన్ని డిసెంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శనివారం ఈ చిత్రం ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. నిత్యామీనన్ మాట్లాడుతూ ‘నాకు చాలా ప్రత్యేకమైన సినిమా ఇది. కథ వినగాననే ఆశ్చర్యానికి గురయ్యా. ఈ కథను సినిమాగా తీయడానికి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదనిపించింది. గత జనరేషన్కు తెలిసిన కథ ఇది. నేటి జనరేషన్కు కొత్త విషయం కాబట్టి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాం. ఇలాంటి సినిమాలు చేయడమే నా డ్రీమ్. మంచి కథ నిర్మాణంలో నేను కూడా భాగమయ్యాను. భవిష్యత్తులో ఇలాంటి కథలుంటే నటిగా, నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నా అని అన్నారు.