సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి
అగ్నిపథ్కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సుప్రీంకోర్టుకు కేంద్రం కోరింది.ఇప్పటి వరకు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. హర్ష్ అజయ్ సింగ్ అనే అడ్వొకేట్ నిన్న ఒక పిటిషన్ వేశారు. అగ్నిపథ్ అమలుపై మరోసారి పునరాలోచించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్ లో అజయ్ కోరారు. అంతకు ముందు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ అనే ఇద్దరు లాయర్లు కూడా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. సాయుధ బలగాల నియామకాలకు సంబంధించి శతాబ్ద కాలంగా ఉన్న ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసిందని… కనీసం పార్లమెంటు ఆమోదం కూడా లేకుండానే అగ్నిపథ్ ను అమలు చేస్తోందని ఎంఎల్ శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అగ్నిపథ్ వల్ల జాతీయ భద్రత, సైన్యం ఎలాంటి ప్రభావానికి గురవుతుందో అంచనా వేయడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అడ్వొకేట్ విశాల్ తివారీ తన పిటిషన్ లో కోరారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేయాలని సుప్రీంకు విన్నవించారు.