సీఎంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రతినిధుల భేటీ
రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ అంశాలపై చర్చ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు పెట్టడానికి టాటా ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో మంగళవారం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, అవకా శాలపై వారు సీఎంతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించినట్లు అధికారులు వెల్లడిరచారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంలో ఎలాంటి సహాయ సహకా రాలు అందించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్ జె.శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీలతో పాటు పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
క్రీడా విజేతలను అభినందించిన సీఎం జగన్ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఈ క్రీడాకారులను సీఎం అభినందించారు. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ (జూనియర్స్ టీమ్)లో కాంస్య పతకం గెలిచిన అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లెకు చెందిన బేబి రెడ్డి టీమ్ తాను జాతీయ స్థాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా సాధించిన పతకాలను చూపారు. ఇటీవల దిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్లో వెండి, కాంస్య పతకాలు సాధించిన షేక్ అర్షద్ తాను జాతీయ స్థాయిలో సాధించిన పతకాలను కూడా సీఎంకి చూపించారు. అక్టోబర్లో ఫ్రాన్స్లో జరగనున్న ట్రాక్ వరల్డ్ కప్లో పాల్గొంటున్నట్లు అర్షద్ వివరించారు. తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని వారిద్దరు కోరారు. సీఎంను వీరితో పాటు బేబి రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామి రెడ్డి, అర్షద్ కోచ్ ఆదిత్య మెహతా ఉన్నారు.