తిరుపతి రుయా ఆస్పత్రిలోనే.. ఒకే రోజు 23 మంది మృతి
మంత్రిపై 420 కేసు నమోదు చేయాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ
ఆక్సిజన్ అందకుండా కరోనా రోగులు మరణించలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందని మే 11వ తేదీ తిరుపతి రుయా ఆస్పత్రి లోనే ఒకే రోజు 23 మంది మృతి చెందారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వమే వారికి అధికారికంగా నష్టపరిహారం చెల్లించిన విషయం మంత్రికి బోధపడలేదా అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతుంటే, 40 లక్షల మంది చనిపోయారని వివిధ సర్వేల్లో తేలిందన్నారు. బుధవారం తిరుపతి సీపీిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది చనిపోయారని కలెక్టర్, ముఖ్యమంత్రి అబద్ధపు ప్రకటన చేశారని, 23 మంది చనిపోయారని పేర్లతో సహా తాను మొట్టమొదట వెల్లడిరచినట్లు చెప్పారు. అబద్ధపు ప్రకటన చేసి పార్లమెంటును, ప్రజలను తప్పుదోవ పట్టించిన కేంద్ర ఆరోగ్య మంత్రి పై 420 కేసు నమోదు చేయాలని అన్నారు. ఏ ప్రధాని వెళ్లని ఇజ్రాయిల్కు నరేంద్ర మోడీ వెళ్లి ఆనాడే చీకటి ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. పెగాసెస్ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నిఘా వేశారని, అంతర్జాతీయ కుట్ర అని బీజేపీనే చెబుతోందని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలు తేల్చాలని కోరారు.