దేశంలో వ్యాక్సినేషన్ గడువుపై ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి డెడ్ లైన్ పై వార్తా పత్రికల్లో వచ్చిన వార్తను, లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సర్కార్ ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం పార్లమెంటులో స్పందించిన తీరును ట్విటర్ వేదికగా తప్పుబట్టారు.మోదీ ప్రభుత్వానికి సత్తా లేదనడానికి, వెన్నెముక లేదనడానికి ఇదే నిదర్శనమని ట్వీట్ చేశారు. ప్రజల జీవితాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు వ్యాక్సిన్ కోసం లైన్లో నిలబడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం గడువేది లేదని అంటోంది.. దేశంలో వ్యాక్సిన్లు ఏవీ అని ప్రశ్నించారు. డిసెంబరు నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని గత మే నెలలో మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అయితే నిన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు.. ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సమాధానమిస్తూ దీనికి గడువంటూ లేదన్నారు. ఈ మహమ్మారి స్వభావం మారుతోందని, అందువల్ల వ్యాక్సినేషన్ పూర్తయ్యే గడువును నిర్దిష్టంగా సూచించడం సాధ్యం కాదని తెలిపారు.