Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఖాదీ అభివృద్ధికి కేంద్రం కృషి

పొందూరు ఖ్యాతిని మరింత పెంచాలి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

శ్రీకాకుళం : ఖాదీ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని, పొందూరు ఖ్యాతి మరింత పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పొందూరులో శనివారం నిర్వహించిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ వడికే విధానం, చరఖాలను సీతారామన్‌ పరిశీలించారు. ఖాదీ భవనం శిథలావస్థలో ఉండటం వలన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలను నాటారు. మహాత్మా గాంధీ పొందూరు ఖాదీ నాణ్యత పట్ల ఎంతో ఆసక్తి చూపారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖాదీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, చాలా పథకాలు ప్రకటించారని చెప్పారు. 2014 సంవత్సరంలో రూ.9 వేల కోట్లుగా ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. ఖాదీకి చాలా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. అయితే కార్మికులకు గిట్టుబాటు ధరలు లేవని, మెగా హాండ్ల్యూమ్‌ క్లస్టర్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మంగళగిరిలో ఒక క్లస్టర్‌ వచ్చిందని, పొందూరులో సంఖ్య తక్కువగా ఉండటంతో క్లస్టర్‌ ఏర్పడలేదని గ్రహించామన్నారు.
పొందూరులో క్లస్టర్‌ ఏర్పాటుకు టెక్స్‌టైల్‌ మంత్రితో మాట్లాడతామని సీతారామన్‌ తెలిపారు. ముద్ర రుణాల ద్వారా అనేక రంగాలకు రుణాలు ఇవ్వవచ్చనీ, ప్రతి బ్యాంకు శాఖ ద్వారా స్టాండ్‌ అప్‌ లోన్‌ ఇవ్వాలని అన్నారు. పొందూరు, చుట్టు పక్కల అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారని, వారికి నాబార్డు బ్యాంకు, లీడ్‌ బ్యాంక్‌ ద్వారా రుణాలు మంజూరు చేయాలని మంత్రి కోరారు. మెగా క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. బ్యాంకుల ద్వారా ఎంత మంది కార్మికులకు రుణాలు ఇచ్చారో బ్యాంకులు మరోసారి ఏర్పాటు చేసే ప్రదర్శనలలో పెట్టాలని కోరారు. గాంధీ జయంతి అక్టోబర్‌ 2వ తేదీ నాటికి 50 శాతం రుణాలు పెంచాలని బ్యాంకులను ఆదేశించారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు, అమ్మకాలకు మంచి ప్లాట్‌ ఫారం అని, దానిలో పొందూరు ఖాదీని చేర్చాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. పొందూరు గ్రామంలో గడపడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌, రాజ్యసభ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, జి.వి.ఎల్‌. నరసింహారావు, ఉత్తరాంధ్ర శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్‌.మాధవ్‌, దువ్వాడ శ్రీనివాస్‌, ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్‌ కుమార్‌, వీవర్స్‌ సెల్‌ రాష్ట్ర సభ్యులు బండారు జై ప్రతాప్‌ కుమార్‌, కేంద్ర అదనపు కార్యదర్శి సంజీవ్‌ కౌశిక్‌, ఖాదీ గ్రామ పరిశ్రమ కమిషన్‌ ఆర్థిక సలహాదారు ఆషిమా గుప్త, జిల్లా కలెక్టర్‌ శ్రీకేశ్‌ లాఠకర్‌, ఎస్‌.పి అమిత్‌ బర్దార్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మాట్‌, సంయుక్త కలెక్టర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడు, ఖాదీ పరిశ్రమ సంచాలకులు ఎస్‌.రఘు, సౌత్‌ జోన్‌ డిప్యూటీ సీఈవో ఆర్‌.ఎస్‌.పాండే, బీసీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి.కె.ప్రసాదరావు, కార్యదర్శి దండ వెంకటరమణ, గ్రామ సర్పంచ్‌ రేగిడి లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img