రూ.150 దిశగా పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా ఇంధన ధరల మంట..
వరుసగా నాల్గవ రోజూ రికార్డు స్థాయికి..
న్యూదిల్లీ : దేశమంతటా ‘పెట్రో’ ధరల మంట మండుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వరుసగా నాల్గవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో అవి రికార్డు స్థాయికి చేరాయి. కరోనా సమయంలో భారీగా పెరుగుతూ గత రెండేళ్లలో ధరలు మూడొంతులు ఎగిశాయి. మొత్తం మీద 150 రూపాయల దిశగా పెట్రో ఉత్పత్తుల ధరలు పరుగులెడుతున్నాయి.
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్ లేదా జెట్ ఫ్యూయల్) ధర కంటే ఇప్పుడు పెట్రోల్ ధర 35 శాతం ఎక్కువగా ఉంది. దిల్లీలో ఏటీఎఫ్ ధర లీటర్కు రూ.79,02గా ఉంది. అంటే లీటర్కు రూ.79కి కాస్త పైన ఉంది. కానీ లీటర్ పెట్రోల్ మాత్రం దిల్లీలో రూ.108 దాటేసింది. ఇక హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలలో పెట్రోల్ ధరలు రూ.112 పైబడే ఉన్నాయి.
పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం అనేక ఉత్పత్తులపై పడిరది. ఇప్పటికే నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. బొగ్గు, చమురు ధరలు గత కొన్నాళ్లుగా పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం పైన మాత్రమే కాకుండా, వివిధ రంగాలపై ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు సిమెంట్ కంపెనీల రవాణా ఖర్చులు 40 శాతం వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు పెరగడం వల్ల ఉత్పత్తి ధర పెరిగి, వినియోగదారుడికి భారమయ్యే అవకాశం ఉంది. అంతిమంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కుదేలవుతున్నారు. శనివారం వరుసగా నాల్గవ రోజు కూడా ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివరాల ప్రకారం, ఇప్పుడు లీటర్కు వరుసగా రూ.108.99, రూ.97.72గా ఉంది. ముంబైలో గరిష్టంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం రూ.114.81, రూ.105.86కు, కోల్కతాలో రూ.109.46, రూ.100.84, చెన్నైలో రూ.105.74, రూ.101.92కు చేరాయి. ఇదిలాఉండగా మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాలో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర రూ.121 దాటగా, డీజిల్ ధర శనివారం రూ.110.29కి చేరుకుంది. పరిశ్రమలోని వర్గాల సమాచారం ప్రకారం, పెట్రోలు ధర లీటర్కు రూ.121.13కు పెరిగింది. డీజిల్ ధర అనుప్పూర్లో లీటర్కు రూ.110.29కు చేరుకుంది. అయితే బాలాఘాట్లో పెట్రోల్ రూ.120 మార్క్ను దాటింది. గత 24 గంటల్లో ఇంధన ధరలు లీటర్ పెట్రోల్కు 36 పైసలు, డీజిల్కు 37 పైసలు పెరిగినట్లు ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న అనుప్పూర్ పట్టణంలోని పెట్రోల్ పంపు యజమాని అభిషేక్ జైస్వాల్ తెలిపారు. జిల్లా కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబల్పూర్ ఆయిల్ డిపో నుండి అనుప్పూర్కు పెట్రోలియం తీసుకువస్తారని, రవాణా ఖర్చులు ఎక్కువగా ఉన్నందున రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ పెట్రోలు ఖరీదు ఎక్కువని జైస్వాల్ చెప్పారు. అదే విధంగా బాలాఘాట్లో పెట్రోల్ ధర రూ.120.06కు చేరుకోగా, డీజిల్ను లీటర్కు రూ.109.32గా విక్రయిస్తున్నట్లు పెట్రోల్ పంప్ యజమాని మనీష్ ఖండేల్వాల్ తెలిపారు. భోపాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.117.71గా ఉండగా, డీజిల్ ధర రూ.107.13గా ఉందని పేర్కొంది.