కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందా? అంటే అవునంటున్నారు కాన్పూర్ ఐఐటీ ఫ్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్. మే నెల 15వతేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కుకు చేరుకుంటాయని కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ శనివారం అంచనా వేశారు. మే నెలలో 50వేల నుంచి 60 వేల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతాయని ప్రొఫెసర్ వెల్లడిరచారు.గణిత నమూనా ఆధారంగా తాను అంచనా వేశానని ప్రొఫెసర్ చెప్పారు. మే మధ్య నాటికి రోజువారీ కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని, ఆ సమయంలో రోజువారీ కేసుల సంఖ్య 60 వేల వరకు నమోదు కావచ్చని చెప్పారు. కరోనా కేసుల పెరుగుదలకు ఆయన రెండు కారణాలను వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తొలి రెండు విడతల్లో చాలా మందికి సోకడంతో సహజ రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారడం తెలిసిందే. ఇప్పుడు 5 శాతం మంది ప్రజల్లో కరోనాపై పోరాడే రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గినట్టు డాక్టర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందడాన్ని రెండో కారణంగా పేర్కొన్నారు. దేశంలో 90 శాతం మందికి, యూపీలో 95 శాతం మందికి సహజ రోగ నిరోధక వ్యవస్థ ఉన్నట్టు అగర్వాల్ తెలిపారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో కరోనా గరిష్ఠ కేసులు 50-60 వేలు అన్నది ఏమంత పెద్దది కాదన్నారు. చాలా కేసుల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నట్టు, దగ్గు, జలుబుకు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చన్నారు. అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ను ఓ సాధారణ ఫ్లూగానే చూడాలన్నారు.