ఏపీలో నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు పనుల్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. పోర్టు ప్రతిపాదిత ప్రాంతానికి పక్కనే ఉన్న సముద్రంలో డ్రెడ్జింగ్ మొదలుపెట్టి జగన్ లాంఛనంగా ప్రారంభించారు. నాలుగు దశల్లో పూర్తవుతుందని భావిస్తున్న ఈ పోర్టులో తొలి దశను 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ సందర్భంగా పోర్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొన్నారు.
పలు ప్రత్యేకతలు కలిగిన ఈ పోర్టు పూర్తయితే ఉద్యోవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు బహుళ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. దీంతో ఈ పోర్టు పనులకు ప్రత్యేకత ఏర్పడిరది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఈ పోర్టు ఉంది. అయితే సాంకేతికంగా చూస్తే నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తోంది. దీంతో సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు చేరుకుని అక్కడి నుంచే పనులు ప్రారంభించారు.
రామాయపట్నం లక్ష్యమిదే..
రామాయపట్నం పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ్ర ఏపీ మారిటైం బోర్డు కింద రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం జరుగుతుంది. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి చేసేందుకువీలు పడుతుంది. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం చేపడతారు. రెండోదశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం చేపడతారు.
ప్రయోజనాలివే
రామాయపట్నం పోర్టు నిర్మాణంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవలు మెరుగుపడతాయి. అలాగే తెలంగాణ, ఛత్తీస్గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం అవుతాయి. బొగ్గు, ఇనుపఖనిజం, గ్రానైట్, ఆహార ధాన్యాలు, బియ్యం సహా ఇతర ధాన్యాలు, సిమెంటు, ఫెర్టిలైజర్స్, పొగాకు, మిర్చి, ఆక్వా ఉత్పత్తులు, కంటైనర్లు తదితర రవాణాలో కీలకం కానుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవారంగానికి ఊతం ఇవ్వనుంది. ఫుడ్ప్రాసింగ్, సాఫ్ట్వేర్ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్, విద్యుత్, టెక్స్టైల్, టూరిజం రంగాలకు పోర్టు ద్వారా మేలు జరగనుంది . ఔషధాలు, రసాయనాలు, ప్లాస్టిక్, ఖనిజాలు, చేతి వృత్తులు, టెక్స్టైల్స్, లెదర్ తదితర ఎగుమతుల్లో కీలకం కానుంది.