ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
ముంబై: వ్యాపారాలు… తమ బ్యాలెన్స్ షీట్లలో అధిక రిస్క్లను పరిగణనలోకి తీసుకోకుండా స్వల్పకాలిక ప్రతిఫలాన్ని కోరే సంస్కృతిని కలిగి ఉండకూడదని భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. వ్యాపారం చేయడంలో రిస్క్ తీసుకోవడం కూడా ఉంటుందని దాస్ పేర్కొన్నారు. రిస్క్ తీసుకునే ముందు ప్రతికూలాంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. దేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఐకానిక్ వీక్ వేడుకల్లో దాస్ మాట్లాడుతూ… బ్యాలెన్స్ షీట్లో అధిక రిస్క్ను పెంచుకోవడంతో సంబంధం లేకుండా స్వల్పకాలిక రివార్డ్ కోరే సంస్కృతికి వ్యాపారాలు దూరంగా ఉండాలన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఈ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించింది. ఆర్బీఐ దృష్టికి వచ్చిన కొన్ని అనుచితవ్యాపార నమూనాలు లేదా వ్యూహాల సాధారణ లక్షణాలలో అసంబద్ధంగా నిధుల సేకరణ విధానం, సంపదను పెంపొందించే రుణ అసమతుల్యతలు ఉన్నాయి… ఇవి అత్యంత ప్రమాదకరమైనవని, భరించదగ్గవి కావని దాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా, అవాస్తవిక వ్యూహాత్మక అంచనాలు, ప్రత్యేకించి సామర్థ్యాలు, వృద్ధి అవకాశాలు, మార్కెట్ పోకడలపై మితిమీరిన ఆశావాదం, పేలవమైన వ్యూహాత్మక నిర్ణయాలకు దారితీయవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, సీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రీ తదితరులు పాల్గొన్నారు.