రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తంచేసింది. ఈ మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డా.బలరామ్ భార్గవ్లు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సంయుక్తంగా లేఖ రాశారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను విస్తృతస్థాయిలో పెంచాలని సూచించారు. ఇందుకోసం 24/7 పనిచేసే ర్యాట్ బూత్లను ఏర్పాటు చేసి, ప్రజలందరికీ అందుబాటులో తేవాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాలిక్యూలర్ పరీక్షల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, పరీక్షలకు అవసరమయ్యే కిట్లను, ల్యాబొరేటరీ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. లక్షణాలున్న వారు సొంతగా/ఇళ్ల వద్ద పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎవరైనా జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి`వాసన కోల్పోవడం, అలసట, డయోరియా వంటి లక్షణాలతో బాధపడుతుంటే కొవిడ్గా అనుమానించి తప్పక పరీక్షలు జరపాలని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. అలాంటి లక్షణాలున్న వారిని వేరుగా ఉంచాలని, ఇంటి వద్ద ఐసోలేషన్ మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది.