అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన సర్దార్ధామ్ భవన్ కార్యక్రమంలోపాల్గొన్న రూపానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం గాంధీనగర్లో విజయ్ రూపానీ మీడియాతో మాట్లాడారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ‘గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు ఈ అవకాశం ఇచ్చిన భాజపాకు నా కృతజ్ఞతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరో మెట్టు ఎక్కించేందుకు అవకాశం లభించింది’ అన్నారు. రూపానీ గుజరాత్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2016లో ఆనందీబెన్ పటేల్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించిన రూపానీ.. 2017లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు నడిపించారు. దీంతో రెండోసారి బీజేపీ అధిష్ఠానం ఆయనపైనే నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. రూపానీ రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు డిప్యూటీగా నితిన్ పటేల్ విధులు నిర్వహిస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం నూతన ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గుజరాత్ నూతన నాయకత్వంపై పార్టీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్ అధ్వర్యంలో అహ్మదాబాద్లో బీజేపీ నాయకులు సమావేశమై చర్చలు జరుపుతున్నారు.