ఎలన్ మస్క్ నుంచి కంపెనీని కాపాడుకునేందుకే…
న్యూదిల్లీ : ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేసి దానిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. 45 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించి ట్విట్టర్లో పూర్తి వాటాను కోనుగోలు చేస్తానని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వెల్లడిరచారు. దీంతో ట్విట్టర్ స్వీయరక్షణ చర్యలను చేపట్టింది. ఈ క్రమంలోనే ‘పాయిజన్ పిల్’ (విష గుళిక) విధానాన్ని ఎంచుకుంది. మస్క్ మినహా మిగతా ట్విట్టర్ వాటాదారులు అదనంగా షేర్లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కలిపించింది. మస్క్ చేసిన ప్రతిపాదనకు స్పందనగా ఈ విధానాన్ని అనుసరించాలని ట్విట్టర్ బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సామాజిక దిగ్గజం పేర్కొంది. మస్క్ ఈ సామాజిక మాధ్యమాన్ని విరివిగా వినియోగిస్తారు. దీని 100శాతం స్టాక్ను కొనుగోలు చేసి ప్రైవేటీకరించాలని భావించారు. కంపెనీ బోర్డు సభ్యుడు కావాల్సి ఉండగా ఆ పదవిని మస్క్ వద్దని అనుకున్నట్లు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఇటీవల వెల్లడిరచారు. ప్రపంచ డీఫ్యాక్టో టౌన్ స్క్వేర్ ట్విట్టర్ అని మస్క్ గతంలో అన్నారు. ట్విట్టర్లో మస్క్కు 9.2 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని 2.9 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ట్విట్టర్ బోర్డులో సభ్యుడైతే ఆయనకు 14.9శాతం కంటే ఎక్కువ భాగస్వామ్యం లభించదు. కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా వ్యవహరించాల్సి ఉంటుంది. ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేయడానికి 73శాతం మంది అనుకూలంగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. తనకు మద్దతిచ్చిన వారికి మస్క్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే చేదు గుళిక విధానం వల్ల ఉన్న వాటాదారులు అదనంగా షేర్లను కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది. తద్వారా బయట వారు వచ్చి కంపెనీ షేర్లను దక్కించుకునేందుకు అవకాశం ఉండదు. ఏదేని కార్పొరేషన్ టేకోవర్లను నివారించేందుకు, వాటాదారుల హక్కులను పరిరక్షించేందుకు ఇటువంటి విధానాలను అనుసరిస్తుంది. ప్రాక్సీ ఫైట్ ద్వారా కంపెనీని మస్క్ సొంతం చేసుకోవచ్చు. అందుకోసం ప్రస్తుత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను తొలగించాలని వాటాదారులు ఓటు ద్వారా నిర్ణయించాల్సి ఉంటుంది. కాగా, జనవరి 31 నుంచి దాదాపు రోజూ ట్విట్టర్ వాటాలను కొంటున్నట్లు మస్క్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొన్నారు. ట్విట్టర్ను దక్కించుకోగలనో లేదో చెప్పలేదన్నారు. తిరస్కృతి ఎదురైతే తన వద్ద ఉన్నవాటినీ విక్రయించేస్తానని ఆయన చెప్పారు. మస్క్ ప్రతిపాదనను ట్విట్టర్ పెట్టుబడిదారులలో కొందరు వ్యతిరేకించారు. వారిలో వ్యాపారవేత్త, సౌదీ యువరాజు అల్వాలిద్ బిన్ తలాల్ ఉన్నారు.