కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి ఆహ్వానం
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ
హైదరాబాద్ : జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీని పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. ఆయన త్వరలో దిల్లీకి మాకాం మార్చి కార్యకలాపాలను ప్రారంభిస్తారంటే మంచిదేనని శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అయితే రాజకీయ లక్ష్యం విషయంలో మాత్రం కేసీఆర్కు స్పష్టమైన వైఖరి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన చాలా దుర్మార్గంగా ఉందని, రానున్న రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉన్న తరుణంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఒకరే అయితే తప్ప ఆశించిన ఫలితాలు ఉండవని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రతిపక్షాలతో మాట్లాడుతోందని, కేసీఆర్ కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతున్న క్రమంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ వ్యతిరేక కూటమిని బలపర్చే రాజకీయ ఎత్తుగడలు వేయాల్సి ఉందని పేర్కొన్నారు.