ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకొన్న శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. ఇవ్వాళ నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. రణిల్ విక్రమసింఘెకు 134 ఓట్లు పడ్డాయి. ఆయన సమీప ప్రత్యర్థి, శ్రీలంక పోడుజన పెరమున ఎంపీ దుల్లాస్ అలహప్పెరుమ రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 82 ఓట్లు పోల్ అయ్యాయి. వామపక్షాల తరఫున పోటీ చేసిన అనుర దిశనాయకె కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. దిశనాయకెకు మూడు ఓట్లు మాత్రమే దక్కాయి. దేశంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించలేక దేశం విడిచి పారిపోయిన గొటబయ రాజపక్స స్థానంలో ఇక రణిల్ విక్రమసింఘె అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన నాయకత్వం వైపే మెజారిటీ శ్రీలంక పార్లమెంట్ సభ్యులు మొగ్గు చూపారు. నిజానికి- రణిల్ విక్రమసింఘె సారథ్యం పట్ల కూడా లంకేయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. తాజాగా ఆయన గెలుపును వారు ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.