సీపీఐ డిమాండ్
న్యూదిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) పదిశాతం రిజర్వేషన్లను సమర్థిస్తూ ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును న్యాయమూర్తుల పూర్ణసభ(ఫుల్బెంచ్)కు నివేదించాలని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గం మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అనేక రాజకీయ పార్టీలు, సామాజిక మాధ్యమాలు సుప్రీం తీర్పుపై అనుమానాలు వ్యక్తం చేసిన దృష్ట్యా వివరణ, తీర్పు రాజ్యాంగబద్ధ అర్హత కోసం న్యాయమూర్తుల పూర్ణసభ పున:సమీక్షకు పంపాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు సమర్థించగా ఇద్దరు వ్యతిరేకించడం, అనేకమంది అసమ్మతి తెలియజేయడంతో రిజర్వేషన్ల విధానానికి సంబంధించి చాలా ప్రశ్నలను లేవనెత్తిందని పేర్కొంది. ‘సీపీఐ కుల, వర్గరహిత సమాజం కోసం అవిశ్రాంతంగా పోరాడుతోంది. సమానత్వం, సామాజిక న్యాయం, కుల నిర్మూలన కోసం సీపీఐ నిలబడిరది. రిజర్వేషన్ల వెనుక చట్టసభ ఉద్దేశం పేదరిక నిర్మూలన కాదు. చారిత్రక వివక్షత, సమాజంలోని అణగారిన వర్గాల నిశ్చయాత్మకమైన చర్య’ అని సీపీఐ పేర్కొంది. మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణను మరింత దుందుడుకుగా ఆచరించాలని ప్రయత్నిస్తున్న సమయంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం మన పోరాటం బలంగా కొనసాగాలని సీపీఐ పిలుపునిచ్చింది.