ఆఫ్గానిస్తాన్లో మరోసారి బాంబు పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. రాజధాని కాబూల్లోని ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా మృతి చెందగా.. అనేకమంది గాయపడ్డారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా ప్రార్థనల కోసం ఖలీఫా సాహిబ్ మసీదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మసీదు కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న మసీదు ఒక్కసారిగా రక్తమోడిరది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ పేర్కొన్నారు. కాగా, పేలుడు కారణంగా మసీదు పైకప్పు కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి అభద్రత మధ్య నిత్యం హింసకు గురవుతున్న ఆఫ్ఘన్ ప్రజలకు ఇది మరో బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా రంజాన్ నెల ఆరంభం తర్వాత గత కొద్ది రోజులుగా అఫ్గాన్లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గత పది రోజుల్లో వివిధ ప్రాంతాల్లో 11 ఉగ్రదాడులు సంభవించాయి. పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు.