ఔరంగాబాద్ : ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు మొబైల్ ఫోన్ లేకపోవడంతో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆమెకు ఒక మొబైల్ ఫోన్ కొని ఇచ్చేందుకు బాలిక తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిపోలేదని పోలీసులు సోమవారం తెలిపారు. ఇక్కడకు సుమారు 260 కిలోమీటర్ల దూరంలోని నయగాన్ నివాసి అయిన ఈ బాలిక జూన్ 16న తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. బాలిక పదవ తరగతి విద్యార్థిని కాగా, ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ‘ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు ఫోన్ కావాలని బాలిక కోరింది. కానీ ఆమె తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనేందుకు డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో బాలిక తీవ్ర చర్య చేపట్టింది. ఘటనా స్థలంలో ఒక లేఖను గుర్తించా మని, ఫోన్ లేకపోవడమే ఈ ఘటనకు కారణమని బాలిక తల్లిదండ్రులు కూడా ధ్రువీకరించారు’ అని నయగాన్ పోలీసు స్టేషన్ అధికారి వివరించారు.