వ్యవసాయానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్.. ఓ యువ రైతుపై అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన తప్పల్లా తన ప్రసంగంలో ఎక్కువగా ఇంగ్లిష్ పదాలను వాడటమే. వివరాల్లోకి వెళితే, వ్యవసాయానికి సంబంధించి బిహార్ రాజధాని పట్నాలోని బాపు సబాగార్ ఆడిటోరియంలో ‘నాలుగో వ్యవసాయ రోడ్మ్యాప్’ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న లఖిసరాయ్కు చెందిన యువ రైతు అమిత్కుమార్.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ప్రశంసిస్తూ ఇంగ్లిష్లో ఉపన్యాసం ప్రారంభించారు. ఆంగ్లంలో ఆయన అన్యాపదేశంగా మాట్లాడుతుండగా నితీశ్ కుమార్ మధ్యలో కల్పించుకున్నారు. ప్రసంగంలో అతిగా ఆంగ్ల పదాలు వినియోగించడం వల్లే కల్పించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇంగ్లిష్లో మాట్లాడడానికి ఇదేమీ ఇంగ్లండ్ కాదు కదా? అని ఆయన మండిపడ్డారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న మీరు గవర్నమెంట్ స్కీమ్స్ అన్న పదానికి బదులుగా సర్కారీ యోజన అనలేరా? అని ప్రశ్నించారు. తాను కూడా ఇంగ్లిష్లోనే ఇంజినీరింగ్ చదివానని, అది వేరే విషయమని వ్యాఖ్యానించారు. రోజువారీ కార్యకలాపాలకు ఇంగ్లిష్ను ఎందుకు ఉపయోగించాలని సీఎం అసహనం వ్యక్తం చేశారు.