శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో శనివారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. జిల్లాలోని సిర్హామా ప్రాంతంలో ఉగ్రమూక ఉన్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలు సెర్చి ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడడంతో ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని కుల్గాం జిల్లాలోని చకీ సమద్ ప్రాంతంలోనూ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.