Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశ పరువును మంటగలిపిన బీజేపీ

సత్య

సుప్రీంకోర్టు ఆదేశించటంతో విధిలేని స్థితిలో లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, మల్లుడు, నలభై కేసులున్న నేరచరితుడైన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ మీద అమిత్‌ షా ఆధీనంలో పనిచేసే దిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన పోక్సోకేసు. ఒక కేసు నమోదు చేసేందుకు దేశ ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్న వార్త ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పు కుంటున్న దేశ పరువును తీసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, పాలకపార్టీ పెద్దలు, వారి సమర్ధకులు తప్ప వేరెవరూ కారణం కాదు. బేటీ పఢావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోదీ ఏలుబడిలో ఆయన అధికార పీఠం ఉన్న చోటే ఆఫ్టరాల్‌ ఒక కేసు నమోదుకు ఇంత రచ్చ జరిగిందంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అని జనం ఆశ్చర్యపోతున్నారు. అంతకు ముందుజరిగిన పరిణామాల్లో అఫ్‌కోర్స్‌ ఎవరేమనుకుంటే నాకేటి…. అనుకున్నట్లుగా ఒకనాడు పరుగులరాణిగా దేశ ప్రజల, క్రీడాకారుల నీరాజనాలు అందుకున్న పిటి ఉష, రెజ్లర్ల మీద విమర్శలకు దిగి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడేమంటారో చూడాలి. దిల్లీ పోలీసుల మీద ఎవరికీ విశ్వాసం లేదు. కేసు నీరుగారేట్లు చేస్తారని అనేక మంది భావిస్తున్నారు. బహుశా ఈ దుమ్ముతోనే కేసులు పెట్టినా తాను రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ పదవికి రాజీనామా చేసేది లేదని బ్రిజ్‌ భూషణ్‌ ప్రకటించారు. కేసులు నమోదు చేశాం కనుక ఆందోళన విరమించండి, జంతర్‌ మంతర్‌ నుంచి వెళ్లిపోండి అంటూ శరవేగంతో వచ్చిన పోలీసులు ఆందోళన శిబిరంలో ఉన్న వారికి నీరు, ఆహారం అందకుండా అడ్డుకున్నారు. బ్రిజ్‌ భూషణ్‌్‌ను అరెస్టు చేసేవరకు నిరసన కొనసాగుతుందని రెజ్లర్లు ప్రకటించారు.
వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసి మల్లయుద్ధ క్రీడాకారులు దేశ ప్రతిష్టను మంటగలిపారంటూ భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) అధ్యక్షురాలు పిటి ఉష ఆరోపించారు. రోడ్డెక్కేముందుకు ఐఓఏను సంప్రదించి ఉండాల్సిం దంటూ హితవు పలికారు. మల్లయోధులు తమ అసోసియేషన్‌కు తాత్కాలిక కమిటీ వేయాలని కోరారని, తామాపని చేసినట్లు ఉష చెప్పారు. అంతకు ముందు జరిగిన ఐఓఏ కార్యవర్గ సమావేశం తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఎల్లవేళలా ఆటగాళ్ల పక్షానే ఉందని, క్రీడలు, అథ్లెట్లు తమ ప్రాధాన్యత అని చెప్పుకున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మీద విమర్శలు వచ్చిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలను చూస్తే అతగాడిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చూపుతున్న శ్రద్ద నిజాలను నిగ్గుదేల్చేందుకు చూప లేదు. నిజానికి రెజ్లర్లను వీధుల్లోకి లాగింది, దేశ ప్రతిష్టను దిగజార్చిందీ కేంద్రం, బీజేపీ తప్ప మరొకటి కాదు. బీజేపీ నేత అద్వానీ మీద హవాలా ఆరోపణ వచ్చినపుడు ఎంపీగా రాజీనామా చేసి ఆ నింద తొలిగిన తరువాతనే తిరిగి ఎన్నికల్లో నిలిచారు. బ్రిజ్‌ భూషణ్‌ అంశంలో బీజేపీ ఎందుకు ఠలాయిస్తున్నట్లు? వెంటనే పదవినుంచి తప్పించి విచారణ సక్రమంగా జరిపించిఉంటే ప్రపంచ క్రీడా రంగంలో, ఇతరంగా దేశపరువు నిలిచేదికదా!
రాజ్యసభకు పంపినందుకు బీజేపీి పట్ల కృతజ్ఞతగా బహుశా పిటి ఉష ఈ కోణాన్ని చూడకుండా రెజ్లర్ల మీదనే దాడికి దిగారన్నది స్పష్టం. నిరసన తెలపటం ప్రజాస్వామిక హక్కు, ఒక మహిళగా తోటి మహిళా అథ్లెట్ల బాధను ఆమె అవగాహన చేసుకోలేదు. అన్ని రంగాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్న సంగతి తెలియదని అనుకోవాలా ? ఇతర అసోసియేషన్లలో చేయని ఆరోపణలు రెజ్లింగ్‌లోనే ఎందుకు వచ్చినట్లు ? రెజ్లర్లు తమ వద్దకు రాలేదని చెబుతున్న ఉష, ఆమే వారిని తన వద్దకు ఎందుకు పిలిపించుకోలేదు. జనవరి 18న తొలిసారిగా రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఆమె రంగంలోకి దిగితే ఇంతదాకా వచ్చేది కాదు కదా ! తాత్కాలిక కమిటీని తమంత తాముగా ఎందుకు వేయలేదు ? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తటం సహజం. లండన్‌ పర్యటనలో రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలతో దేశం పరువు తీసినట్లు, పోయినట్లు బీజేపీ ఇప్పటికీ నానా యాగీ చేస్తోంది. ఇప్పుడు అదే భాషను పరుగుల రాణి వినిపించారు.నిరసన తెలపటమే నేరం అన్నట్లు మాట్లాడారు? బీజేపీ గీసినగిరి నుంచి వెలుపలికి వస్తే ప్రపంచంలో గతంలో, వర్తమానంలో జరుగుతున్నదేమిటో ఆమెకు తెలిసి ఉండేది. అసలు ఆమె సంగతేమిటి ? ఆమె క్రమశిక్షణ బండారమేమిటి ?
పిటి ఉష రాజకీయ రంగు దాస్తే దాగేది కాదు. క్రీడా రంగంలో ఉన్నంత వరకే ఆమె క్రీడాకారిణి. తరువాత సాధారణ పౌరురాలే. ఏ రాజకీయ పార్టీనైనా అభిమానించవచ్చు, చేరవచ్చు. ఆమె నెరపిన రాజకీయం ఏమిటో కేరళ జనానికి తెలుసు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఏ క్షణంలోనైనా బీజేపీిలో చేరవచ్చని 2021 పత్రికలను తిరగేస్తే వచ్చిన వార్తలు చూడవచ్చు. విజయ యాత్ర జరిపిన బీజేపీ చివరికి ఉన్న ఒక్క అసెంబ్లీ సీటు, అంతకు ముందు వచ్చిన ఓట్లను కూడా పోగొట్టుకుంది. ఏ రాష్ట్రంలోనూ సిఎం అభ్యర్థిని ప్రకటించటం తమ విధానం కాదని చెప్పుకొనే బీజేపీి అక్కడ మెట్రో మాన్‌ శ్రీధరన్ను ప్రకటించింది. తనకేమీ రాజకీయాల్లేవంటూనే 2016లో కేరళలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఆహ్వాన సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ మరుసటి ఏడాది ఉష అథ్లెటిక్‌ స్కూలులో సింథటిక్‌ ట్రాక్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. మూడుసాగు చట్టాలను ఆమె సమర్ధించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారంటూ గ్రెటా థన్‌బెర్గ్‌, గాయని రిహానాను ఖండిరచారు. వీటికి ప్రతిఫలంగా ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది.
ఉత్తర ప్రదేశ్‌లోని గోండాప్రాంతంలో ఒకనాటి రౌడీ షీటర్‌, ఇప్పటికీ హత్యాయత్నం, కొట్లాట, దోపిడీ వంటి 40 క్రిమినల్‌ కేసులున్న ప్పటికీ గాంగ్‌స్టర్లను ఏరిపారవేస్తానన్న యోగి పాలనలో ఆ జాబితాలో ఇతగాడి పేరు లేదు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా దేశంకోసం, ఉత్తరప్రదేశ్‌ ఉన్నతికోసం ఎప్పుడూ సాధు, సంతులతో కలసి తిరిగే బీజేపీి గాంగ్‌స్టర్లు వేరయా అని లోకానికి సందేశ మిచ్చారు. ఎందుకంటే అరవై ఆరు సంవత్సరాల ఈ పెద్దమనిషి స్వయంగా మల్లయోధుడు, ఒకసారి ఎస్‌పి, ఐదుసార్లు బీజేప ీఎంపీగా ఉన్నారు. అదనపు అర్హతలు ఏమంటే పేరుమోసిన హిందూత్వవాది, బాబరీమసీదు కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుడనని స్వయంగా చెప్పుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వ హిందూపరిషత్‌లతో సంబంధాల గురించి చెప్పనవసరంలేదు. ఆ ప్రాంతంలో ‘‘శక్తిశాలి’’ అని అనుచరులు ఆకాశానికి ఎత్తుతారు. ఎందుకు అంటే కెమెరాల సాక్షిగా అతిక్‌ అహమ్మద్‌ అనే గూండా సోదరులను కాల్చిచంపిన ఆ పుణ్య గడ్డమీదే తన స్నేహితుడిని చంపిన హంతకుడిమీద కాల్పులుజరిపి హతమార్చి నట్లు కెమెరాలముందే ప్రకటించిన బ్రిజ్‌ భూషణ్‌ తీరు ఉత్తర ప్రదేశ్‌లోగాక మరెక్కడ జరుగుతుంది. లోక్‌సభఎన్నికలలో బీజేపీి తరఫున పోటీకి దిగినపుడు నాలుగుసార్లు ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ నేత ఆనందసింగ్‌ మీద పోటీ వద్దని నాటి జిల్లా పోలీసు అధికారి తన కార్యాలయానికి పిలిపించుకొని అడగ్గా తీవ్ర వాదోపవాదాల్లో భాగంగా తన దగ్గరఉన్న తుపాకిని తీసి ఎస్‌పిమీద గురిపెట్టగా వెనక్కు తగ్గిన తరువాత తాను వెనక్కు వెళ్లినట్లు స్వయంగా మీడియాతో చెప్పారు. అంతేనా ముంబై డాన్‌ అరుణ్‌ గావ్లీ అనుచరుడిని చంపినట్లు ఆరోపణలున్న దావూద్‌ ఇబ్రహీం అనుచరులు సుభాష్‌ ఠాకూర్‌, జయేంద్ర ఠాకూర్‌, ప్రకాష్‌ దేశాయిలతో చేతులు కలిపినందుకు టాడా చట్టం కింద అనేక నెలలు తీహార్‌ జైల్లో ఉన్న హిందూ`ముస్లిం జాతీయవాది, గాంగస్టర్ల ఐక్యతావాది. ఇలాంటి వారి మీద కేసులకు పట్టే గతి తెలిసిందే. ఎవరైనా ముందుకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పి బతగ్గలరా ?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img