Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

హద్దులు లేని హక్కుల పరిరక్షణకు ‘అన్‌హద్‌’

డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘‘దేశభక్తి మన చివరి ఆధ్యాత్మిక మజిలీ కాకూడదు. నేను వజ్రాల ధరనిచ్చి గాజుపూసలు కొనుక్కోను. నా జీవితకాలంలో ఎన్నడూ దేశభక్తి మానవత్వాన్ని అధిగమించనీయను’’విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 2002లో గుజరాత్‌లో జరిగిన మారణహోమానికి ప్రతిస్పందనగా మార్చి 2003లో అన్‌హద్‌ పేరుతో ఒక ఎన్‌జీఓ సంస్థ రూపుదిద్దుకుంది. ఆ సంస్థ ఇరవైఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్‌హద్‌ కార్యమ్రాల్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సి ఉంది. అలాంటి ఎన్‌జీఓల ఆవసరం నేడు దేశంలో ఎంతగాఉందో ఆలోచించుకోవాల్సి ఉంది. దేశంలో నాశనమవుతున్న మానవహక్కులు, అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం, బద్దలవుతున్న సామాజిక న్యాయం, బీటలు వారుతున్న సుహృద్భావం కొంతమంది సామాజిక కార్యకర్తల్ని, మార్క్సిస్టు మేథావుల్ని స్థిమితంగా కూర్చోనీయలేదు. సామాజిక కార్యకర్త షబ్నమ్‌ హాష్మి, ఆమె సోదరుడు సఫ్దర్‌ హష్మి, మార్క్సిస్టు చరిత్ర కారుడు ప్రొఫెసర్‌ ఫణిక్కర్‌, సామాజిక కార్యకర్త హర్ష్‌ మందర్‌ ప్రభృతులంతా కలిసి దిల్లోలో ‘అన్‌హద్‌’ను ప్రారంభించారు. మానవహక్కులు, ప్రజాస్వామ్యం, ప్రజల మధ్య సుహృద్భావం వంటివి పరిరక్షిస్తూ దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పాలన్న మహదాశయంతో అన్‌హద్‌ఎన్‌జీఓ ప్రారంభమైంది. ‘అన్‌హద్‌’ అంటే హద్దులు లేనిది. కుల, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ద్వేషాన్ని నింపి, మనిషిని మనిషితో కలవకుండా చేస్తున్నవారి ఆటలు కట్టించడానికి ఆన్‌హద్‌ ఏర్పడిరది.
‘‘మతతత్వాన్ని మట్టుబెట్టే పని ముస్లింలది. సిక్కులది, క్రైస్తవులది, హిందువులదిఅంతేకాదు, భారతీయులందరిదీ! దీనికోసం వారంతా మతతత్వ దృక్పధాన్ని అధిగమించి నిజమైన జాతీయవాద మనస్తత్వాన్ని అలవరచు కోవాలి!!’’ అని అన్నారు సుభాస్‌ చంద్రబోస్‌. మనిషి మనిషిని బతికించు కోవాలని, మనిషి మనిషిని ప్రేమించాలని, మనిషే కేంద్రంగా జరుగుతూ వస్తున్న అన్ని కార్యక్రమాలనూ ప్రోత్సహించాలని అన్‌హద్‌ సంస్థ నిర్వాహకులు దృఢనిశ్చయంతో ముందుకు నడిచారు. స మాజాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన, పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం ఒకటుంది. కేవలం నిజాయితీ, నిబద్దతలమీద నడుస్తున్న ఈ ఎన్‌జీఓకు ఏ ఆర్థికవనరులూ లేవు. చెప్పుకోదగ్గ నెట్‌వర్కూ లేదు. అయినా, ఆదిశక్తికి మించి దేశ పౌరులకు స్పూర్తి నందిస్తూ ఉంది. నాటకకర్త సఫ్దర్‌హష్మి అన్‌హద్‌ కంటే ముందు ‘సహెమత్‌’ అనే సంస్థను రూపొందించారు. ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది. సహెమత్‌ అంటే అంగీకరించడం‘అన్‌హద్‌’ ఉద్దేశం. ముఖ్యంగా గుజరాత్‌లోను, కశ్మీర్‌లోను, మతతత్వ వాదలు దాడుల్ని ఎదుర్కోవడం, వారిని ధైర్యంగా చట్టానికి అప్పగించడం ఈ సంస్థ సాధించిన విజయాలలో అన్‌హద్‌ ఆలోచనల్ని, ఆశయాల్ని జనంలోకి విరివిగా తీసుకుపోవడానికి పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించడం జరిగింది. ‘‘దురాగతాలను బహిర్గతం చేస్తూ, ఉన్నత నైతిక భావాలను వ్యాప్తి చేయడం కంటే మిన్న అయిన లక్ష్యమూ ప్రయోజనమూ సాహిత్యానికి మరొకటి లేదు’’అని మన తెలుగు మహాకవి గురజాడ అప్పారావు అన్నారు కదా? అన్‌హద్‌ సభ్యులు గ్రూపులుగా ఏర్పడి, జనంలో తిరుగుతూ ప్రజలకు మానవ హక్కుల గూర్చి, రాజ్యంగంలోని కీలక అంశాల గూర్చి, మానవీయ విలువల గూర్చి విరివిగా ప్రచారం చేయడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అన్‌హద్‌లో భాగస్వాములు కావడం ఈ దేశ పౌరులందరి బాధ్యత! ఇంతవరకు జరిగిన, జరుగుతున్న పరిశోధనలన్నీ మనుషులు చేసినవే. మానవ శ్రేయస్సు కోసం చేసినవే తప్ప, ఏ అతీత శక్తి మహిమా కాదు. స్వార్థ చింతనతో అబద్దాలు ప్రచారం చేసి, అధికార పీఠం దక్కించుకుని, మారణహోమాలు సృష్టిస్తున్న వారు మన కళ్ల ముందే ఉన్నారు. భ్రమల్లో బతకకుండా వాస్తవాల్ని గ్రహిస్తూ కుట్రదారుల మోసాల్ని తిప్పి కొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజలే ఐకమత్యంతో పరిపాలకుల మీద ఒత్తిడి పెంచాలి. అందరికీ అవకాశాలు, అందరికీ న్యాయం సమంగా అందే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాల హద్దుల్ని చెరిపేసి, మనుషులంతా ఒక్కటేఅనే ఆలోచనలోకి రావాల్సి ఉంది. ‘అన్‌హద్‌’ఎన్‌జిఓను ఒక ట్రస్ట్‌గా రిజిస్టర్‌ చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలోని కన్నింగ్‌ లేన్‌లో ఉంది. మొదట ఆరుగురు ట్రస్టీ సభ్యులుగా ఉన్నారు. వారుషబ్నమ్‌ హాష్మి, అబన్‌ రాజా, అమృతా నాండి, హర్స్‌ మందర్‌, శుభా మీనన్‌, ముఖ్తార్‌ షేక్‌! ఆ తర్వాత కాలంలో ప్రొఫెసర్‌ కె.ఎన్‌.ఫణిక్కర్‌, ప్రొఫెసర్‌ రామ్‌ పపున్యాని, శోభా ముద్గల్‌ (సంగీతకారిణి) కమలాభాసిన్‌ (స్త్రీవాద రచయిత్రి) సయీద్‌ అఖ్తర్‌ మిర్జా (రచయిత చిత్ర దర్శకుడు) ధృవ్‌ సంగం (గాయకుడుసంగీతకారుడు) మొదలైన ప్రముఖులంతా గత పదహారేళ్లుగా ఆ ట్రస్ట్‌లో ఉన్నారు. 2002 గుజరాత్‌ మారణ హోమానికి బలి అయి, నిరాశ్రయలైన బాలబాలికల్ని అన్‌హద్‌ సంరక్షించింది. గుజరాత్‌ అల్లర్లపై వచ్చిన ‘పర్జానియా’వంటి చలన చిత్రాలు వారికి చూపించి, వాస్తవాలు అర్థమయ్యేట్టుగా చేసింది. 2010 లో ఈ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్మీ సెక్యూరిటీ బలగాలు కశ్మీర్‌ లోయలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాయని ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల్ని అపహాస్యం చేసాయనీ అపహాస్యమే కాదు కొన్ని చోట్ల అవి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయని అందుకు కారణం ఇప్పటి కేంద్ర భ్రుత్వమేననీ అన్‌హద్‌ నిర్భయంగా చెప్పగలిగింది. అలాగే బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ రేసు గురించి దర్యాప్తు చేయాల్సిందిగా దిల్లీ పోలీసులను అన్‌హద్‌ డిమాండ్‌ చేసింది. 2009 లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు మీద ఈ ఎన్‌జిఓ సంస్థ దృష్టి సారించింది. ఆ విషయాన్ని దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయడానికి ‘రిజర్వేషన్‌ ఎక్స్‌ప్రెస్‌’ అనే కార్యక్రమం రూపొందించుకుంది. దేశంలో దుష్ట పాలనకు మూల కారణమైన ఆరెస్సెస్‌ను వెంటనే నిషేధించాలని అన్‌హద్‌ 2012 మార్చి 24న డిమాండ్‌ చేసింది. దేశంలో ముస్లింల అస్థిత్వాన్ని విశ్లేషించడానికి జాతీయ సమావేశాలు నిర్వహించింది. ఉగ్రవాదం పేరుతో అన్యాయంగా మైనార్టీల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని నిరసిస్తూ 2010 లోను 2012 లోనూ కార్యక్రమాలు చేపట్టింది. ధులే అల్లర్ల మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి, మానవ హక్కుల పరిరక్షణకు సామాజిక న్యాయ స్థాపనకు పోరాడిరది. అన్‌హద్‌ చేపట్టిన కార్యక్రమాలలో ఇవి కొన్ని మాత్రమే దేశంలో ప్రభుత్వ పరంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అన్‌హద్‌ ఎండగడుతూనే వచ్చింది. నిరంతరం తన పోరాటం కొనసాగిస్తూనే ఉంది. స్వర్గమంటే ఎక్కడో లేదు. దాన్ని ఈ ధరాతలం మీద మనమంతా కలిసి నిర్మించుకోవాల్సి ఉందన్న మాటను వాస్తవంలోకి తేవడానికి దేశ పౌరులంతా కంకణబద్దులవ్వాలి.
‘‘నరేంద్రమోదీ, అమిత్‌షాలతో కలిసి ఈ దేశ ప్రజలనందరినీ నేను ఘోరంగా మోసం చేశాను. బిజెపి చేసిన స్కాంలలో నాది కూడా సమానమైన భాగస్వామ్యం ఉంది. ఈ అపరాధ భావంతో నేను చచ్చిపోదలుచుకోలేదు. అందుకే, నన్ను క్షమించమని భారతీయులందరినీ వేడుకుంటున్నారు.’’ అని చనిపోవడానికి ముందు రామ్‌ జత్మలానీ (14 సెప్టెంబర్‌ 19238 సెప్టెంబర్‌ 2019) ప్రకటించాడు. ఆ ప్రకటన పత్రికలు అచ్చేశాయి. ఆయన మాట్లాడిన వీడియో కూడా దేశ ప్రజలకు అందింది. రామ్‌ జత్మలాని సుప్రీంకోర్టు లాయరు, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అంతే కాదు, రాజకీయవేత్త, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి. దీనివల్ల ఏం తెలుస్తోంది అంటే నిజాలు దాగవు! అని. డిస్కవరి సైన్స్‌ వంటి టెలివిజన్‌ ఛానల్‌ కార్యక్రమాలు ఒక్క పది నిముషాలు శ్రద్ధగా గమనిస్తే చాలు. మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లాడు? ఎంత సాధించాడు? అనేది అర్థమవుతుంది కానీ, మన ప్రభుత్వాలు విచక్షణా జ్ఞానాన్ని కప్పిపెట్టే విధంగా రైతులు ఆవు ఆధారిత వ్యవసాయం చేయాలని ప్రయటిస్తాయి. ఆవు మూతర్ర, ఆవు పేడ ప్రదర్శిస్తూ ప్రజల్ని వెనక్కి అనాగరిక సమాజంలోకి నెట్టేస్తాయి. ప్రభుత్వాలు చేస్తున్న అనైతిక దోపిడిని ఎవరూ, ప్రశ్నించగూడదని ప్రభుత్వ పెద్దలు కోరు కుంటున్నారు. కానీ, అది ఎల్లకాలం సాగుతందా? రైతు చట్టాల్ని ప్రజలు ఎలా తిప్పికొట్టారో గత సంవత్సరం చూశాం కదా? అదే స్ఫూర్తిని తీసుకుని ప్రజలు ఇతర విషయాలలో కూడా వివేకవంతంగా ఎందుకు స్పందించరూ? వారికి కావల్సిందేదో వారు ఎందుకు సాధించుకోరూ? ‘అన్‌హద్‌’ లాంటి ఎన్‌జిఓలు ప్రజలకు అండగా ఉంటూనే ఉన్నాయి.
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img