న్యూదిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ధనాధన్ క్రికెట్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ రాకతో భారత క్రికెట్ స్వరూపమే మారిపోయింది. యావత్ క్రికెట్ ప్రపంచం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గుప్పిట్లోకి వచ్చింది. ప్రతీ క్రికెటర్ ఒక్కసారైనా ఐపీఎల్ ఆడాలనుకునేంత ఆదరణ వచ్చింది. ఏటా ఐపీఎల్ విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్ను 10 జట్లకు పెంచాలని ఎప్పట్నుంచో బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా సన్నాహకాలు కూడా మొదలుపెట్టింది. 8 జట్లతో ఈ సీజనే చివరిదని వచ్చే సీజన్లో 10 జట్లు పాల్గొంటాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైందని పేర్కొన్నాడు. అయితే ఈ కొత్త ఫ్రాంచైజీల బేస్ ప్రైజ్ను రూ. 2వేల కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వార్త భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ విషయాన్ని బోర్డుకు సంబంధించిన ఓ అధికారే తెలిపారు. కొత్త ఫ్రాంచైజీల రేసులో అహ్మదాబాద్, లక్నో, పుణె ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం, లక్నోలోని ఏకనా స్టేడియాలు భారీ సామర్థ్యంతో కూడుకున్నవి. దీంతో ఈ రెండు పట్టణాల పేర్లు కొత్త ఫ్రాంచైజీలకు అనువుగా ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికొస్తే అదానీ, ఆర్పీజీ సంజీవ్ గోయంక గ్రూప్, టొరెంట్ ఫార్మాతో పాటు మరికొన్ని సంస్థలు బిడ్ దాఖలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కొంతమంది బాలీవుడ్, సౌతిండియన్ హీరోలు సైతం ఫ్రాంచైజీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.