ముంబై : భారత క్రికెట్ అభిమానులకు పెద్ద శుభవార్త వచ్చింది.వచ్చే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా జట్టుకు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ఎంతో మంది యువ ఆటగాళ్లను రాహుల్ ద్రవిడ్ తీర్చిదిద్దాడు. ఇక నుంచి భారత్ జట్టుకు ఆయన శిక్షణ ఇస్తాడు. గతరాత్రి చెన్నై-కోల్కతా మధ్య ఐపీఎల్ సీజన్ -14 ఫైనల్ మ్యాచ్ జరిగిన సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ, సెక్రటరీ జైషా..ద్రవిడ్తో మాట్లాడారు. గంగూలీ, జైషా కలిసి రాహుల్ను 2023 వరకు టీమిండియా హెడ్ కోచ్గా ఒప్పించారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి జాతీయ మీడియాకు వెల్లడిరచాడు. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్..ఎన్సీఏ హెడ్గా కొనసాగుతున్నాడు. అతి త్వరలోనే తన బాధ్యతల నుంచి తప్పుకుంటాడని, తర్వాత భారత జట్టు హెడ్ కోచ్గా పగ్గాలు అందుకుంటాడని ఓ జాతీయ మీడియా ప్రచురించింది. ఇప్పటికే ద్రవిడ్ అండర్-19 స్థాయిలో చాలామంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. తన పర్యవేక్షణలో మేటి ఆటగాళ్లుగా ఉన్న వారు..ప్రస్తుతం టీమిండియా జట్టులోనూ మెరుస్తున్నారు. ఈ నెల 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్ టోర్నీ తర్వాత టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుంది. దీంతో టీమిండియా కోచ్గా అనిల్ కుంబ్లేతో పాటు అనేకమంది విదేశీ మాజీ ఆటగాళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి బీసీసీఐ రాహుల్ ద్రవిడ్ వైపే మొగ్గుచూపింది.