తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఆర్థిక సాయం చేస్తారా? చేయరా? సీఎం చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.రాజకీయ లబ్ధి కోసం లేని సమస్యను సృష్టించి సీఎం రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. ఏడేళ్ళుగా తెలంగాణతో ఒప్పందం మేరకు ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొంటోందన్నారు. హుజురాబాద్ ఓటమిని డైవర్ట్ చేయటానికే కేంద్రంపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని, అబద్దాల పునాదుల మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.పార్టీని బ్రతికించుకోవటానికి ముఖ్యమంత్రి ధర్నాలు చేయటం మెదటసారి చూస్తున్నానని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో ఎంఎంటీఎస్ పనులు నిలిచిపోయాయన్నారు. దళితుడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి జరగదనే విధంగా సీఎం మాట్లాడడాన్ని ఖండిస్తున్నానన్నారు. కేసీఆర్ కుటుంబం శక్తినంతా ధారపోసినా హుజురాబాద్లో ఓటమి తప్పలేదన్నారు.