హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణలు నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. గిల్డ్ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ మద్దతు తెలిపింది. సినిమా చిత్రీకరణలను కొన్ని రోజులు ఆపాలని నిర్ణయించినట్లు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి తెలిపారు. అందరం కూర్చొని మాట్లాడుకుంటామని, పరిష్కారం దొరికే వరకూ షూటింగ్లను తిరిగి మొదలు పెట్టబోమని నిర్మాత దిల్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. కొత్త సినిమాలే కాదు, చివరి దశలో ఉన్న చిత్రాల షూటింగ్లు కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. తాజా నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎవరూ సంతోషంగా లేరని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి, చిత్ర పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టేందుకు ఏం చేయాలన్నది త్వరలో చర్చిస్తామని ఫిలిం ఛాంబర్ తెలిపింది. ఈ క్రమంలోనే 24 విభాగాల వారితోనూ చర్చలు జరుపుతామని పేర్కొంది. అయితే, ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకొంటున్న ఇతర భాషా చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫిల్మ్ ఛాంబర్లో 48 మంది సభ్యులతో సర్వసభ్య సమావేశం నిర్వహించిన నిర్మాతల మండలి, సభ్యుల సంపూర్ణ మద్దతుతో సినిమా షూటింగ్స్ నిలిపివేస్తు న్నట్లు స్పష్టం చేసింది. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం, ఓటీటీలో కొత్త సిని మాలు, నిర్మాణ వ్యయాలు, నిర్మాతలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్న క్రమం లో వాటిని సరిదిద్దేందుకు దృష్టిసారించిన నిర్మాతలు… సినిమాల చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్స్తో పాటు కొత్త సినిమా లేవీ సెట్స్ పైకి వెళ్లవు. దీంతో చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ లాంటి అగ్రహీరోల సినిమాల చిత్రీకరణ నిలిచిపోనుంది. సమస్యలు పరిష్కారమయ్యే వరకు షూటింగ్స్ బంద్ కొనసాగుతుందని దిల్ రాజు తెలిపారు. అలాగే అధ్యక్షుడిగా ఉన్న కొల్లి రామకృష్ణ పదవీకాలం ముగియడంతో ఈ సమావేశంలో సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా కొత్తా బసిరెడ్డిని ఎన్నుకున్నారు.