రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని..దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని అన్నారు. నగరంలో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదని అన్నారు. కొన్ని కంపెనీల కుమ్మక్కు వల్లే స్టీల్, సిమెంటు ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలో ఫార్మా సిటీని ప్రారంభిస్తామన్నారు. బయటి రాష్ట్రాల వాళ్లు బతుకుదెరువుకోసం తెలంగాణకు వస్తున్నారని, కానీ మనవాళ్లు దుబాయ్ పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించేలా క్రెడాయ్ ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకు అవసరమైన సాయం ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణపై క్రెడాయ్ దృష్టిపెట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ను విమర్శించడమే విపక్షాలకు తెలుసునని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు ఏం చేస్తారో విపక్ష నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తున్నామని, భవిష్యత్ తరాల కోసం పెట్టే పెట్టుబడిని అప్పులుగా చూడరాదని వెల్లడిరచారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడిరచారు. 18 నెలల్లో హైదరాబాద్కు కొత్త మాస్టర్ప్లాన్ తయారుకానుందని తెలిపారు. సొంత జాగా ఉన్నవారు ఇళ్లు కట్టుకుంటే రూ.3 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.