విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్ధులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా తయారు అవుతారని చెప్పారు. తమ పిల్లలను ఈ ఉచిత శిబిరానికి పంపించడం ద్వారా ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీహెచ్ఎంసి పరిధిలోని మొత్తం 6 జోన్ లలో 854 సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ సమ్మర్ క్యాంప్లో అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, కరాటే, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి తదితర 44 రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, నెల రోజులపాటు ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుందని, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జీహచ్ఎంసి జాయింట్ కమిషనర్ యాదయ్య, కార్పొరేటర్ దీపిక, స్పోర్ట్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.