కేంద్రం అసమర్థత, వైఫల్యం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపణలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్లు ఉండేదని, ఇవాళ దాన్ని రూ.11.5 లక్షల కోట్లకు పెంచుకోగలిగామని చెప్పారు. ‘‘కానీ కేంద్రం సరిగా పరిపాలన చేయకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇది నేను చెబుతున్న లెక్క కాదు. ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ తేల్చి చెబుతున్న లెక్కలు ఇవి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్థాయిలో పనిచేసినా ఇవాళ మన జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లు ఉండాలి. కానీ మనం రూ.11.5 లక్షల కోట్ల వద్దే ఆగిపోయాం. ఆ తప్పు తెలంగాణది కాదు, కేంద్రానిది’’ అని వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో నీటి సమస్యలు ఉన్నాయని, నీళ్లు తగినన్ని ఉన్నా ప్రజలకు అందుబాటులోకి రావని, కరెంటు సమస్యలు ఉన్నాయని వివరించారు. కానీ దేశం మొత్తమ్మీద ఇలాంటి సమస్యలను అధిగమించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.