ప్రపంచాన్ని మంకీ పాక్స్ మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలోని ఈ మహమ్మారి అనేక రాష్ట్రాలలో విస్తరిస్తున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో నిన్న మొన్నటి వరకు మంకీ పాక్స్ కేసు అని ఆందోళన వ్యక్తం కాగా, తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన రిపోర్టులు మంకీ పాక్స్ నెగిటివ్ అని తేల్చాయి. దీంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే ఖమ్మం జిల్లాలో మరో మంకీ పాక్స్ అనుమానిత కేసు నమోదైంది.
ఖమ్మంలో వలసకూలీకి మంకీ పాక్స్ లక్షణాలు
ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో 32 ఏళ్ల వలస కూలీకి మంకీ పాక్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన సందీప్ ఖమ్మం జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఇక ఈ వ్యక్తి చర్మంపై దద్దుర్లు మరియు మంకీ పాక్స్ ఇతర లక్షణాలతో మంగళవారం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారని వర్గాలు తెలిపాయి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతని శరీరంపై నల్లటి మచ్చలు రావడంతో అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళాడు.