గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ కోసం శనివారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వందశాతం వ్యాక్సినేషన్లో భాగంగా ఆగస్టు 23వ తేదీ నుంచి నగరంలోని 4846 కాలనీలు, మురికివాడల్లో పదిహేను రోజుల్లోనే 360 లొకేషన్లలో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ కోసం మొత్తం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 సంచార టీకా వాహనాలు, కంటోన్మెంట్ పరిధిలో 25 మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సోమేశ్ కుమార్ వివరించారు. ప్రభుత్వం ప్రారంభించనున్న స్పెషల్ డ్రైవ్లో ప్రతి ఒక్కరూ సహకరించి వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎస్ నగర ప్రజలకు సూచించారు.