: సీపీ అంజనీకుమార్
ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ట్యాంక్బండ్పై సుందరీకరణ దెబ్బతినకుండా ట్రయల్ రన్ నిర్వహించగా దానికి సంబంధించిన ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నేడు పరిశీలించారు. అనంతరం సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ, గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టమ్ వాడుతున్నట్లు తెలిపారు. ట్యాంక్బండ్పై క్రేన్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు చెప్పారు. పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్బండ్పైకి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ శాఖ ద్వారా తీసుకోవాల్సిన అనుమతులను ఆన్లైన్ ద్వారానే ఇవ్వనున్నట్లు డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు. మండపాల నిర్వాహకులు వెబ్సైట్ ద్వారా వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు వాటిని పరిశీలించి గణేష్ మండపాల ఏర్పాటుతో పాటు నిమజ్జన అనుమతులు ఆన్లైన్ ద్వారా ఇస్తారని ఆయన తెలిపారు. గణేష్ మండపాల వద్ద, నిమజ్జన శోభాయాత్రలో డి.జె.లకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.