ప్రపంచ దేశాల ఆలోచనలకు తగ్గట్లుగా వ్యాపారాన్వేషణ మార్గాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన దిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్’ అనే అంశంపై ప్రసంగిస్తూ, భారత్ లో పెట్టు బడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలకు ఇదే అనుకూల సమయమని ఉద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సరికొత్త ఆవిష్కరణలు చేయడంలో భారత యువత ఎంతో ఉత్సుకతతో ఉందన్నారు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అయితే ఈ కష్ట కాలంలోనూ భారత్ బలమేంటో చూపించామన్నారు. ఇంత కష్టసమయంలోనూ సుమారు 80 కోట్ల మందికి పైగా దేశ పౌరులకు ఉచిత రేషన్ అందిస్తున్నాం. అదేవిధంగా 160 కోట్ల మందికి కరోనా టీకాలు అందించామన్నారు. కరోనా ను మరింత ధీటుగా ఎదుర్కొనేందుకు ‘వన్ ఎర్త్- వన్ హెల్త్’ అనే నినాదంతో పలు ప్రపంచదేశాలకు ఔషధాలు, కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేశాం.. తద్వారా మిలియన్ల మంది ప్రాణాలను కాపాడామని వివరించారు. భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారుగా ఎదిగింది. ఇక్కడి వైద్యులు తమ అసమాన సేవలతో అందరి మెప్పు పొందారు. ఇక భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రోత్సహిస్తోంది. ఐటీ రంగం రాత్రింబవళ్లు పని చేస్తూ రికార్డు స్థాయిలో సాఫ్ట్వేర్ నిపుణులను అందిస్తోంది.‘ అని చెప్పారు. ‘భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనువైన సమయని అన్నారు. 2014లో ఇక్కడ కేవలం వందల సంఖ్యలో మాత్రమే స్టార్టప్ లు ఉండేవి. కానీ నేడు ఆ సంఖ్య 60 వేలకు పైగా దాటిపోయింది. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలకు సంబంధించి భారత నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, మేక్ ఫర్ ది వరల్డ్’ అనే ఆలోచనతో భారతదేశం నేడు ముందుకు సాగుతోందన్నారు. టెలికాం, ఇన్సూరెన్స్, డిఫెన్స్, ఏరోస్పేస్తో పాటు, సెమీకండక్టర్ల రంగంలో కూడా భారత్ నేడు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. డిజిటల్ ఇన్ఫ్రా రంగంలో దేశం ఎంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు. ఆరోగ్య సేతు యాప్, కోవిన్ పోర్టల్ భారతదేశానికి గర్వకారణం. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారత్ లో ఉంది. గత నెలలో యూపీఐ ద్వారా 440 కోట్ల లావాదేవీల జరిగాయి. ‘ అని ప్రధాని ప్రసంగించారు. ఈ వర్చువల్ మీటింగ్లో మోడీతో పాటు జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, ఈయూ కమిషన్ చీఫ్ ఉర్సువా వాన్ డెర్ లేయన్ కూడా పాల్గొన్నారు.