వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను నిర్వీర్యం చేయదలచిందన్నారు. రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి అధికారం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా? లేక మూడేళ్లు నిద్రపోయారా? అని ప్రశ్నించారు. మూడేళ్ల తదుపరి మూడు రాజధానుల విషయంలో రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని రాజ్యాంగ సవరణ కోరుతూ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్ దాఖలు చేయటమేంటని ప్రశ్నించారు. సీఎం జగన్కి చిత్తశుద్ధి ఉంటే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. అలాగే పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టాలన్నారు.