Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

సీపీఐ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి

ఎన్టీఆర్‌ జిల్లా సమితి సమావేశంలో జల్లి విల్సన్‌

విశాలాంధ్ర`విజయవాడ: అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడ నగరంలో నిర్వహించనున్న భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ పిలుపునిచ్చారు. స్థానిక హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం నిర్వహించారు. విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో విల్సన్‌ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మతోన్మాద రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీపీఐ జాతీయ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. కమ్యూనిస్టుల బలం తగ్గిపోయిందనే ప్రచారం పెద్దఎత్తున సాగుతున్న తరుణంలో, అది అబద్ధమని చాటి చెప్పేలా జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించే ప్రదర్శన, బహిరంగ సభకు లక్షలాదిగా జనసమీకరణ చేయాలని కోరారు. కార్మికులు, కర్షకులు, దళితులు, గిరిజనులు, మైనారిటీ లను సమీకరించాలని, ఇందుకోసం వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో మోదీ సర్కారు కేవలం మూడు అంశాలను అజెండాగా చేసుకుని పాలన సాగిస్తోం దన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్లకు అప్పగించడం, రాజ్యాంగ సంస్థలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలను బెదిరించి అధికారాన్ని బదిలీ చేయడం, మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ జాతీయ మహాసభల జయప్రదానికి ఎన్టీఆర్‌ జిల్లా మహాసభ పునాది కావాలని అన్నారు. కమ్యూనిస్టుల పోరాటం వల్లే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఈ విషయాన్ని యువతకు తెలియజేసి పార్టీవైపు ఆకర్షిం చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆగస్టు 10, 11 తేదీల్లో జిల్లా మహా సభలు మైలవరంలో నిర్వహించ నున్నట్లు తెలిపారు. జిల్లా మహాసభల జయప్రదానికి అన్ని ప్రాంతాల నాయకులు తమవంతు సహకారం అందించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img