సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక
విడోన్ : హంద్రీనీవా ద్వారా కర్నూలు జిల్లాలోని 106 చెరువులకు నీరు నింపకపోతే రాయలసీమ జిల్లాల్లో అన్ని పార్టీలను ఏకంచేసి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతా మని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్నూలు జిల్లా
డోన్ మండలం వెంకటాపురం చెరువును ఏపీ రైతు సంఘం అధ్వర్యంలో ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలు దుర్విని యోగం చేస్తోందని విమర్శించారు. హంద్రీనీవా నీటితో జిల్లాలో చెరువులు నింపకపోవడం దారుణమన్నారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరందిస్తామని చెప్పిన కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేకపోయాయని మండిపడ్డారు. కరువుకాటకాలకు నిలయంగా మారిన జిల్లాలో సాగునీరు, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పైప్లైన్ ఖర్చులకు ప్రభుత్వం రూ.224 కోట్లు ఖర్చు చేయాలని భావించిన ప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. చెరువులకు నీరందితే రెండు పంటలు సాగు చేసి అప్పుల ఊబి నుంచి రైతులు బయటపడతార న్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెరువులు నింపే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనే యులు, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రసూల్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నబీరసూల్, రంగనాయుడు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్బాబు, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, ఏఐటీ యూసీ జిల్లా నాయకులు కృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, రైతు సంఘం నాయకులు చిన్నరంగన్న, బొంతిరాళ్ల సర్పంచ్ రవిమోహన్, ఏపీజీ ఎస్ జిల్లా కార్యదర్శి రాముడు, సీపీఐ ప్రజా సంఘాల నాయకులు లక్ష్మి నారాయణ, నారాయణ, రహిమన్, పులిశేఖర్, వాసు, పుల్లయ్య, రవి, చంద్ర శేఖర్, ప్రభాకర్, బాషా, సమీమ్ బేగం, హసీనా తదితరులు పాల్గొన్నారు.
అక్రమ మైనింగ్ను అరికట్టాలి
కర్నూలు జిల్లా వెల్దుర్తి, బేతంచెర్ల ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ను అరికట్టాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైసెన్సులు లేకున్నా అధికార పార్టీ నాయకులు ధనార్జనే ధ్యేయంగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీలోనే రెండువర్గాలు మైనింగ్ కోసం కొట్టుకునే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణాలు ఆగిపోయాయని, ఫలితంగా నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. దివాలా కంపెనీకి సీఎం జగన్ ఇసుక టెండర్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో తెలియడం లేదన్నారు.