Friday, April 26, 2024
Friday, April 26, 2024

విశాఖ ఉక్కు నష్టాలు కేంద్రం కుట్రే

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐ ఎన్‌ఎల్‌) దశల వారీగా నష్టాల్లోకి వెళ్లడం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై త్వరలో ఎంపీలందరినీ కలిసి వాస్తవాలు వివరిస్తారని, ప్రైవేటీకరణను ఆపాల్సిం దిగా కోరతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అడుగడుగునా ద్రోహం చేస్తూనే ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన హామీలను పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్‌లో కనీసం నిధులు కేటాయించలేదు. అన్నింటినీ విస్మరించి… పదేపదే మోసం చేస్తున్నది. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్మేందుకు మోదీ సర్కార్‌ పావులు కదిపింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా దశల వారీగా నష్టాల్లోకి నెట్టింది. గతేడాది రూ.913 కోట్ల లాభాలు వచ్చిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 2022-23లో రూ.3049 కోట్లు నష్టం రావడం వెనక కేంద్రం కుట్ర దాగి ఉంది. దాదాపు రూ.3 లక్షల కోట్ల విలువచేసే రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విశాఖ స్టీల్‌ప్లాంట్‌)ను అదానీకి కారుచౌకగా కట్టబెట్టేందుకు చూస్తున్నది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 810 రోజులకు పైగా ఉద్యమం నిర్విరామంగా జరుగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. విశాఖ ఉక్కుకు సంబంధించి కేంద్రం కుట్రపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నోరువిప్పాలి. తన వైఖరి స్పష్టం చేయాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఏపీ ఎంపీలు సమిష్టిగా గళం విప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. విశాఖ ఉక్కు అమ్మకాన్ని విరమించుకుంటున్నట్లు కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చేటట్లు చూడాలని రామకృష్ణ ఎంపీలను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img