2014 నుంచి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారణ
సచివాలయ ఉద్యోగులతోపాటు ప్రజాప్రతినిధుల పీఏల ప్రమేయం
తాజాగా నలుగురు అరెస్ట్
విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కుంభకోణంలో ఎక్కువ మంది ప్రమేయమే ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ముఖ్యంగా సచివాలయంలోని కొందరి ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో దాదాపు రూ.117 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గతంలోనే గుర్తించారు. దీనికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్లో ఈ కేసు నమోదయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచే సీఎం రిలీఫ్ ఫండ్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. తప్పుడు పేర్లు, పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులను దిగమింగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. సీఎంఆర్ఎఫ్లో సబార్డినేట్లుగా పని చేస్తున్న చదలవాడ సుబ్రమణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేట్ పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకు చెందిన మురళీకృష్ణలను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడి, పాస్ వర్డులను సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్తో వీరు నిధులు దిగమింగినట్లు ఆధారాలు సేకరించారు. ప్రజాప్రతినిధులకు ప్రైవేట్ పీఏగా పని చేస్తున్న ధనరాజు ఈ అక్రమాల్లో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు 88 ఫైళ్లలో అక్రమాలు జరిగినట్లు బ్యాంకు అకౌంట్ల ద్వారా గుర్తించారు. ఈ వ్యవహారంలో సుమారు 50 మంది వరకు ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.