స్టాన్ఫోర్డ్ అధ్యయనం అంచనా
సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్లేనన్న అధ్యయనం
భారత్ జనాభా పరంగా ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే మన దేశ జనాభా 140 కోట్లను సమీపించింది. రానున్న సంవత్సరాల్లో ఇది ఇంకా పెరిగిపోయి జనాభా పరంగా భారత్ మొదటి స్థానాన్ని చేరుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. వీటికి విరుద్ధంగా.. భారత్లో జనాభా తగ్గిపోతుందని స్టాన్ఫోర్డ్ అధ్యయనం చెబుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది.రాబోయే 78 సంవత్సరాలలో దేశంలో 41 కోట్లు తగ్గిపోతుందని స్టాన్ ఫోర్డ్ తాజా అధ్యయనం అంచనా వేసింది. జనాభా అంతరించిపోవడం వల్ల విజ్ఞానం మరియు జీవన ప్రమాణాలు స్తబ్ధుగా ఉంటాయని పేర్కొంది. భారత్ లో ప్రతీ చదరపు కిలోమీటర్ కు 476 మంది జీవిస్తుండగా, చైనాలో ఇది 148గానే ఉంది. 2100 నాటికి భారత్లో జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 335కు తగ్గుతుంది. భారత్లోనే కాదు, చైనా, అమెరికాలోనూ జనాభా క్షీణత పరిస్థితులు ఉంటాయని స్టాన్ ఫోర్డ్ అధ్యయనం చెబుతోంది. 2100 నాటికి చైనా జనాభా 93 కోట్లు తగ్గిపోయి 49.4 కోట్లకు పరిమితం అవుతుంది. సంతానోత్పత్తి రేటు ఆధారంగా ఈ అంచనాలను స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ప్రకటించింది.